ఆస్కార్ అవార్డులతో దేశం ఉప్పొంగింది.. గర్విస్తోంది: ప్రధాని మోదీ

  • ఆర్ఆర్ఆర్, ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాలకు ప్రధాని అభినందన
  • నాటు నాటు ప్రజాదరణ విశ్వవ్యాప్తం అయిందన్న మోదీ
  • ప్రకృతితో జీవించాల్సిన ప్రాముఖ్యతను చాటి చెప్పారంటూ విస్పరర్స్ యూనిట్ కు ప్రశంస
ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాలు ఆస్కార్ అవార్డులు గెలవడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక అవార్డులతో దేశం ఉప్పొంగిపోయిందని, గర్విస్తోందని అన్నారు. ఆర్ఆర్ఆర్, విస్పరర్స్ చిత్ర బృందాలను ప్రధాని అభినందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వేర్వేరుగా అభినందన సందేశాలు పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘అద్భుతం. నాటు నాటు ప్రజాదరణ విశ్వ వ్యాప్తం. ఇది ఎన్నో ఏళ్లు గుర్తుండిపోయే పాట అవుతుంది. ఇంత ప్రతిష్ఠాత్మక గౌరవం అందుకున్న ఎంఎం కీరవాణి, చంద్రబోస్, మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు. భారతదేశం ఉప్పొంగింది, గర్విస్తోంది’ అని ట్వీట్ చేశారు. 

మరో ట్వీట్‌లో విస్పరర్స్ బృందాన్ని కొనియాడారు. ‘కార్తికి, గునీత్ మోంగా, ది ఎలిఫెంట్ విస్పరర్స్ బృందం మొత్తానికి నా అభినందనలు. ఈ చిత్రంతో సుస్థిర అభివృద్ధి, ప్రకృతితో సామరస్యంగా జీవించాల్సిన ప్రాముఖ్యతను అద్భుతంగా హైలైట్ చేశారు’ అని ట్వీట్ చేశారు.

Narendra Modi
RRR
The Elephant Whisperers
Oscars win

More Telugu News